ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి
నేడు ప్రమాణ స్వీకారం
21కి చేరనున్న జడ్జీల సంఖ్య
అమరావతి,: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేశ్రెడ్డి, కన్నెగంటి లలితకుమారి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి వారితో శనివారం ప్రమాణం చేయించనున్నారు. వాస్తవానికి ఈ ముగ్గురితో సహా మొత్తం ఆరుగురి పేర్లను న్యాయమూర్తుల పదవికి సిఫారసు చేస్తూ హైకోర్టు కొలీజియం గత ఏడాది సుప్రీంకోర్టుకు జాబితా పంపింది.
అయితే సుప్రీంకోర్టు కొలీజియం బి.కృష్ణమోహన్, కె.సురేశ్రెడ్డి, కె.లలితకుమారిలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వారి పేర్లను గత నెలలో కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ జాబితాను పరిశీలించిన కేంద్రం.. రాష్ట్రపతికి సిఫారసు చేయగా, ఆయన ఆమోదముద్ర వేశారని కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి రాజేందర్ కశ్యప్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ముగ్గురి చేరికతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది..


