టీమిండియాత తన తొలి డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమైన తరుణంలో అందుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 22వ తేదీ నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగనున్న డే అండ్ నైట్ టెస్టుకు భారత మాజీ టెస్టు కెప్టెన్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో డే అండ్ నైట్ టెస్టు ఆడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సేవలందించిన టెస్టు కెప్టెన్లను అందరినీ ఆహ్వానించి వారి యొక్క అనుభవాలను పంచుకోనుంది.ఇందుకు ఎం.ఎస్.ధోని కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం.దీనికి స్టార్ స్పోర్ట్స్ అంగీకారం తెలిపితే ధోనిని కామెంటరీ బాక్స్లో చూసే అవకాశం వీక్షకులకు దక్కుతుంది. 2019 వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైన తర్వాత ధోని ఏ మ్యాచ్లోనూ ఆడలేదు. అప్పట్నుంచి తన వ్యక్తిగత పనులతో పాటు కుటుంబంతోనే ధోని గడుపుతున్నాడు. దాంతో ధోనిని ఫీల్డ్లో చూసే అవకాశాన్ని అతని అభిమానులు మిస్ అవుతున్నారు. ఒకవేళ ధోని వ్యాఖ్యాతగా వస్తే మరొకసారి అతని అభిమానులు ఖుషీ అవుతారు. ఇక ఆడియో కామెంటరీ ఏర్పాట్లకు కూడా స్టార్ యాజమాన్యం సిద్ధమవుతోంది.