రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత ప్లేయర్ సానియా మీర్జా అదిరే ఆరంభాన్నిచ్చింది. మరోసారి హైదరాబాదీ సానియామీర్జా తన సత్తా చాటింది. సానియా తన ఆటతీరుతో మళ్లీ ఓ టైటిల్ కొట్టింది. ఆస్ట్రేలియాలో జరిగిన హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ను ఎగురేసుకుపోయింది. ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచెనోక్తో కలిసి సానియా మీర్జా.. ఫైనల్లో అదరగొట్టింది. ఆమె ఆటతీరుకి అంతా ఫిదా అయ్యారు. సానియా జోడీ 6-4, 6-4 స్కోర్తో ఫైనల్లో చైనాకు చెందిన జాంగ్ షువాయ్, పెంగ్ షువాయ్ జోడిపై గెలుపొందింది. సానియా, కిచెనోక్ జంట.. ఏ దశలోనూ ప్రత్యర్థులకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో టైటిల్ వీరి వశం అయింది. ఈ టైటిల్ తో 2020 సంవత్సరాన్ని సానియా మీర్జా ఘనంగా ప్రారంభించినట్టయింది.2017లో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాదీ స్టార్.. తన కొడుకుకు జన్మనిచ్చాక మళ్లీ హోబర్ట్ టోర్నీతోనే సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడం విశేషం. సానియా కెరీర్లో ఇది 42వ డబ్ల్యూటీఏ టైటిల్. 2017లో బ్రిస్బేన్ టోర్నీ నెగ్గాక మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపైనే సానియా టైటిల్ను సాధించింది. త్వరలో జరగబోయే గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో సానియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.
