👉 రేపటితో ముగియనున్న లాక్డౌన్ కొనసాగింపుపై నేడు స్పష్టత రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నేడు దీనిపై ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్బెంగాల్ రాష్ట్రాలు లాక్డౌన్ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉంది. ఈ విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. నమోదైన కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ 15 తర్వాత మరో రెండు వారాల పాటు కొవిడ్-19ను దీటుగా ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
