రాష్ట్రంలో శుక్రవారం నుంచి డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామని, పొదుపు సంఘాల అప్పులకు వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ తెలిపారు.
ఈ మేరకు డ్వాక్రా సంఘాలకు బుధవారం ఆయన లేఖలు రాశారు.
‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం’ డ్వాక్రా సంఘాలకు మరింత ఊతంగా నిలుస్తుందన్నారు.
కరోనా నియంత్రణ చర్యలను అమలు చేస్తూనే సీఎం వ్యక్తిగతంగా రాసిన లేఖలను గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు.
ఈ నెల 24న సీఎం జగన్ ఈ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
అనంతరం, ఒక బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడత డబ్బులు జమ అవుతాయని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు.
90,37,254 మంది మహిళా సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1400 కోట్లు ఒకే విడత జమవుతాయి.
ఏ పొదుపు సంఘానికి ఎంత వడ్డీ జమచేశారనే వివరాలను లేఖలో తెలియజేస్తారు.
డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్ నంబర్లు లేఖతో పాటు అందజేస్తారు.
